Sajjala Ramakrishna Reddy: ఏపీలో అభివృద్ధి జరగకపోతే ఇదంతా ఎలా సాధ్యమైంది?: సజ్జల

Sajjala press meet on development in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. 

ఈ నాలుగేళ్ల 10 నెలల సమయంలో పయనీర్ అల్యూమినియం, అపోలో టైర్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని, ఇవన్నీ రూ.1000 కోట్లు, రూ.2 వేల కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు ఎయిర్ పోర్టు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు... ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. 

మధ్యలో కొవిడ్ వచ్చిందన్న సంగతి మర్చిపోరాదని సజ్జల పేర్కొన్నారు. రెండేళ్లు కొవిడ్ తోనే సరిపోయిందని, ఆ సమయంలోనూ ప్రభుత్వం యాక్టివ్ గానే ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభం వేళ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయిలో సిబ్బంది అందించిన సేవలు బ్రహ్మాండంగా ఉన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. 

కొవిడ్ సమయంలో ఈ వ్యవస్థలు లేకుంటే ఈ సేవలు అందేవే కావని... పేదవాళ్లు, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ సేవలు అందించామని సజ్జల స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవాళ్ల జాబితాలు సచివాలయాల్లో ఉంటాయని, కావాలంటే వెళ్లి చూసుకోవచ్చని అన్నారు. 

ఇక, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా సంఘాలు కునారిల్లిపోయాయని, రుణమాఫీ చేస్తాన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోగా, సున్నా వడ్డీ కూడా ఆపేశాడని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు ఇవ్వనిది కూడా జగన్ వచ్చాక ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. 

జగన్ వచ్చేసరికి దివాలా తీసిన స్వయం సహాయక గ్రూపులు 18 శాతం ఉంటే, జగన్ అధికారం చేపట్టిన ఒకట్రెండు నెలల్లోనే అది 3 శాతానికి తగ్గిందని, ఇప్పుడది 0.17గా ఉందని సజ్జల వెల్లడించారు. గతంలో 9 లక్షల గ్రూపులు... 95 లక్షల మంది సభ్యులు ఉంటే, జగన్ హయాంలో ఇప్పుడా మహిళల సంఖ్య 1.15 కోట్లకు చేరిందని సజ్జల సగర్వంగా చెప్పారు. ఆ మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు, సకాలంలో తమ గ్రూపులకు రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు అని వివరించారు. 

చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలు రూ.55 వేల కోట్ల రుణం తీసుకుంటే, జగన్ నాలుగేళ్ల 10 నెలల కాలంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు రూ.1.69 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకున్నారని తెలిపారు. ఇంత ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఆదాయం మహిళలకే పోతోందని వెల్లడించారు. 

మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని, చేయూత పథకం ద్వారానూ రూ.18,750 ఇచ్చి సహకరిస్తున్నామని వెల్లడించారు. 16 లక్షల మంది చేయూత పథకం కింద స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ విధంగా ఒక కోటి 15 లక్షల కుటుంబాలు ఆదాయం పరంగా పైకి వచ్చాయంటే అభివృద్ధి జరిగిన నట్టు కాదా? అని సజ్జల ప్రశ్నించారు. 

ఇక, దేశ జీడీపీలో మన రాష్ట్ర వాటా 2014-19 మధ్య 4.47 శాతం ఉంటే, జగన్  ప్రభుత్వం హయాంలో అది  4.82కి పెరిగిందని సజ్జల చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే ఇది ఎలా సాధ్యమైంది? ఇవి మేం చెబుతున్న గణాంకాలు కాదు... కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు అని స్పష్టం చేశారు. 

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అప్పులపై  కూడా సజ్జల వివరణ ఇచ్చారు. 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారని.... చంద్రబాబు హయాంలో రూ.2.58 లక్షల కోట్లు అప్పు తీసుకుంటే, జగన్ హయాంలో తీసుకున్న అప్పు రూ.2.98 లక్షల కోట్లు అని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Development
Jagan
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News