Road Accident: ఇంటర్ పాసైనందుకు స్నేహితులకు పార్టీ.. బైక్‌పై వస్తుండగా బస్సు ఢీకొని నలుగురూ మృతి

  • అక్కడికక్కడే ముగ్గురి మృతి
  • ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరి మృతి
  • వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు
4 Inter students killed in road accident in Warangal dist

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లందకు చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌తేజ్, పొన్నాల రనిల్ కుమార్ ఒకే బైక్‌పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పాసైన గణేశ్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి ఒకే బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్, బస్సు రెండూ అతివేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

More Telugu News