Zomato: జొమాటో ఫుడ్ ఆర్డర్‌లు ఇప్పుడు మ‌రింత ప్రియం.. కార‌ణం ఇదే..!

  • ప్లాట్‌ఫారమ్ ఫీజును 25 శాతం పెంచిన జొమాటో
  • ఒక్కో ఆర్డర్‌పై రూ.5కి చేరిన‌ ప్లాట్‌ఫారమ్ రుసుము 
  • కొత్త ప్లాట్‌ఫారమ్ ఫీజు జొమాటో గోల్డ్‌తో సహా వినియోగదారులందరికీ వ‌ర్తింపు
Zomato food orders to now cost more

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తాజాగా మ‌రోసారి త‌న‌ ప్లాట్‌ఫారమ్ ఫీజును 25 శాతానికి పెంచింది. దీంతో ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి చేరింది. కాగా, గ‌తేడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు త‌న బిజినెస్‌ను లాభదాయకంగా న‌డ‌ప‌డానికి దానిని రూ. 3కి పెంచింది. 

ఇక నూతన సంవత్సర సందర్భంగా రికార్డు స్థాయిలో ఫుడ్ ఆర్డర్‌లను అందుకుందీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్. దాంతో జనవరిలో ప్లాట్‌ఫారమ్ రుసుమును రూ. 3 నుండి రూ. 4కి పెంచింది. ఇక కొత్త ప్లాట్‌ఫారమ్ పీజు జొమాటో గోల్డ్‌ సహా వినియోగదారులందరికీ వ‌ర్తించ‌నుంది. అటు కంపెనీ ఇంటర్-సిటీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ను సస్పెండ్ చేసింది.

"పెంపుదలలు జరుగుతున్నాయి. మేము త్వరలో మీకు స‌ర్వీస్‌ చేయడానికి తిరిగి వస్తాం. దయచేసి వేచి ఉండండి" అని జొమాటో యాప్‌లోని 'లెజెండ్స్' ట్యాబ్‌లో సందేశాన్ని పంపింది. ఇదిలాఉంటే.. గత వారం ఈ సంస్థ‌కు రూ. 11.81 కోట్ల వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) తో పాటు ఇత‌ర‌ పెనాల్టీలు ప‌డ్డాయి. ఇందులో జీఎస్‌టీ వాటా రూ. 5.9 కోట్లు ఉండ‌గా.. జులై 2017 నుంచి మార్చి 2021 కాలానికి గాను రూ. 5.9 కోట్ల పెనాల్టీలు ఉన్నాయి.

More Telugu News