Repolling: మణిపూర్‌లోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్

  • కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం దృష్ట్యా రీపోలింగ్ నిర్ణయం
  • ఎన్నికల సంఘం సూచన మేరకు మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకటన
  • లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో శుక్రవారమే పూర్తయిన పోలింగ్
Repolling in 11 polling centers in Manipur

కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. మణిపూర్‌లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 22న (సోమవారం) రీపోలింగ్ నిర్వహించనున్నట్టు మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) శనివారం ప్రకటించారు. తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న ఈ స్టేషన్లలో జరిగిన ఎన్నికలు శూన్యమని, లెక్కలోకి తీసుకోలేదని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

ఖురాయ్ నియోజకవర్గంలోని మొయిరంగ్‌కంపు సాజేబ్, తొంగమ్ లైకై, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని క్షేత్రీగావ్‌లో నాలుగు, థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరగనుందని సీఈవో వెల్లడించారు. కాగా లోక్‌సభ తొలి దశలో భాగంగా శుక్రవారం మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్‌ స్థానాల్లో 72 శాతం పోలింగ్ నమోదయింది. అయితే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తం 47 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని కాంగ్రెస్‌  పార్టీ డిమాండ్‌ చేసింది. ఇన్నర్ మణిపూర్‌లో 36 చోట్ల, ఔటర్ మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.

More Telugu News