ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించా... కాంగ్రెస్‌కు మాత్రం ఓటు వేయకండి!: మమతా బెనర్జీ

Mamata Banerjee hits out amid Lok Sabha polls
  • ఇండియా కూటమి ఉనికిలో లేదన్న మమతా బెనర్జీ
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా లెఫ్ట్ పార్టీలకు ఓటు వేయవద్దని విజ్ఞప్తి
  • బీజేపీని ఓడించాలనుకుంటే వారికి ఓటు వేయవద్దన్న మమతా బెనర్జీ
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌‌‌లో వారు బీజేపీతో జత కలిశారని ఆరోపించారు. ఇక్కడ ఇండియా కూటమి ఉనికిలో లేదని వ్యాఖ్యానించారు. ముర్షిదాబాద్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కు ఓటు వేయవద్దని సూచించారు.

బెంగాల్లో మాత్రం ఆ పార్టీలు బీజేపీ కోసం పని చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని... ఇండియా కూటమి అని పేరు కూడా తాను పెట్టానని గుర్తు చేశారు. మీరు బీజేపీని ఓడించాలనుకుంటే కాంగ్రెస్, సీపీఐ(ఎం)లకు అనుకూలంగా ఓటు వేయవద్దని సూచించారు.

రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో హింస ముందస్తు ప్లాన్‌తో జరిగిందన్నారు. మమతా బెనర్జీ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బెంగాలీ హిందువులను రక్షించడంలో ఆమె విఫలమైందని మండిపడ్డారు. ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన రామనవమి వేడుకల సందర్భంగా జరిగిన హింసకు మమతా బెనర్జీ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.
Advertisement
Mamata Banerjee
Congress
Lok Sabha Polls
BJP

More Telugu News