Dasoju Sravan: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకే సామాజిక వర్గాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

  • ఫోన్ ట్యాపింగ్‌లో నాటి హోం సెక్రెటరీలను, డీజీపీలను ఇతర అధికారులను అందరినీ విచారించాలని డిమాండ్
  • రైతుబంధు కోసం ఖజానాలో ఉంచిన నగదును రేవంత్ రెడ్డి మింగేశారని ఆరోపణ   
  • ఇంత తక్కువ కాలంలోనే ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని ఎక్కదా చూడలేదని వ్యాఖ్య  
Balka Suman accuses revanth reddy for reddy officers in his cabinet

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకే సామాజిక వర్గాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 2014 నుంచి 23 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని  అంటున్నారని అయితే అప్పటి హోం సెక్రెటరీలను, డీజీపీలను ఇతర అధికారులను అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నారని... మరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా లేక వాళ్లని కొట్టాలా? అని నిలదీశారు.

కడియం శ్రీహరి నీతిమంతుడే అయితే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. నీతులు చెప్పడం కాదని.. రాజీనామా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. కే కేశవరావు 85 ఏళ్ల వయస్సులో ఎందుకు పార్టీ మారారో చెప్పాలన్నారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందన్నారు. దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రైతులందరికీ రైతుబంధు ఇప్పటికీ రాలేదని విమర్శించారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిన నగదును రేవంత్ రెడ్డి మింగేశారని ఆరోపించారు. రైతుబంధు నిధులు కొన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఇంకొన్ని ఢిల్లీకి కప్పం కట్టారన్నారు. ఇంత తక్కువ కాలంలోనే ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని ఎక్కదా చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతు శ్రేయస్సును రేవంత్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. బీఆర్ఎస్ రోడ్డెక్కితే తప్పా ప్రాజెక్టుల నుంచి నీరు వదలరా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

More Telugu News