ఇలాంటి నిరాధార ఆరోపణలను చైనా ఎన్నిసార్లయినా చేస్తుంది: భారత్
- అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటున్న చైనా
- తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్
- ఇలాంటి ప్రకటనలు చైనాకు కొత్తేమీ కాదన్న విదేశాంగ శాఖ
- చైనా వ్యాఖ్యలతో భారత్ కు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టీకరణ
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో సమగ్ర భాగమేనని ఉద్ఘాటించారు. తమ వైఖరిలో అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ స్పష్టమైన పంథాతో ఉందని తెలిపారు.
చైనా వ్యాఖ్యలతో భారత్ కు వాటిల్లే నష్టమేమీ లేదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ నుంచి విడదీయరాని, మార్చలేని భాగమని జైస్వాల్ వివరించారు. ఇలాంటి నిరాధార ప్రకటనలు చైనాకు కొత్తేమీ కాదని, అలాంటి ఆరోపణలు చైనా ఎన్నిసార్లయినా చేస్తుందని విమర్శించారు.