Sabitha Indra Reddy: కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసింది... ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy says brs will win chevella lok sabha seat
  • మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్న మాజీ మంత్రి
  • చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపు
  • కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆరోపణ

కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించిందని... కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్‌లో బుధవారం బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. అలవిగాని హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాసాని గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ లోక్ సభ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుదామన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News