Poonam Kaur: గీతాంజలి మరణంపై స్పందించిన నటి పూనమ్ కౌర్.. వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు

Actress Poonam Kaur reacts to Geetanjali death and criticised YS Sharmila
  • ఈ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్న నటి
  • సాటి మహిళలు, పిల్లల పట్ల స్పందించడమే నిజమైన స్త్రీ నాయకత్వమని వ్యాఖ్య
  • ఎక్స్ వేదికగా టీపీసీసీ అధ్యక్షురాలిపై విమర్శలు గుప్పించిన పూనమ్ కౌర్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్న తెనాలి వివాహిత గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. ఈ ఘటనపై స్పందించలేదంటూ  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించారు. సాటి మహిళలు, పిల్లల పట్ల దయాగుణంలో ఉండడమే స్త్రీ నాయకత్వానికి ప్రధాన లక్షణమని అన్నారు. గీతాంజలి ఘటనపై షర్మిల స్పందించకపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని పూనమ్ కౌర్ అసహనం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

గీతాంజలి మరణానికి కారణమైనవారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది ఎవరనేది తనకు అయోమయంగా మారిందని పూనమ్ కౌర్ అన్నారు. ఒక పార్టీకి చెందిన ట్రోలర్లా, లేక కనిపించకుండా పోయిన వలంటీరా అనేది తనకు అర్థంకావడం లేదన్నారు. నిందితులను గుర్తించి శిక్షించాలని, గీతాంజలి పిల్లలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా గీతాంజలి మరణం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె మృతికి టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల ట్రోలింగ్ కారణమంటూ అధికార వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఆయా పార్టీల నేతలు కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.
Poonam Kaur
YS Sharmila
Geetanjali death
Andhra Pradesh

More Telugu News