పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం... నోటిఫికేషన్ విడుదల
- గతంలో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019
- 2019లో ప్రతిపక్షాల నిరసనల మధ్యే సీఏఏకి ఆమోదం
- నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమలులో ఇన్నాళ్ల పాటు ఆలస్యం
ఈ చట్టం ప్రకారం... పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ల నుంచి ముస్లిమేతరులు వలస వస్తే, వారివద్ద సరైన పత్రాలు లేకపోయినా భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ ఉపయోగపడుతుంది. 2014 డిసెంబరు 31కి ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్ లో ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ ఉపకరిస్తుంది.
2019లో సీఏఏ చట్టం తీసుకువచ్చారు. పార్లమెంటులో దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశాయి. ఉభయ సభల్లో బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా సీఏఏకి పార్లమెంటు ఆమోదం లభించడంతో రాష్ట్రపతి కూడా రాజముద్ర వేశారు.
అయితే సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో దీని అమలు ఆలస్యం అయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏ అమలుపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు.