Dasoju Sravan: హైకోర్టు తీర్పును స్వాగతించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ

  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతల స్పందన
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తమకు కూడా ఎమ్మెల్సీలుగా అర్హతలు ఉన్నాయని వెల్లడి
  • వెనుకబడిన వర్గాల వారికి చట్టసభలకు అవకాశం అరుదుగా వస్తుందని వ్యాఖ్య
Dasoju Sravan welcomes High Court Judgement

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ... రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తమకు కూడా ఎమ్మెల్సీలుగా అర్హతలు ఉన్నాయని తెలిపారు. వెనుకబడిన వర్గాల వారికి చట్టసభలకు అవకాశం అరుదుగా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేశారు. ఈ తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

అయితే కేబినెట్‌కు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే హక్కు ఉందని... గవర్నర్ తమ విషయంలో పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసింది.

More Telugu News