TS Lok Sabha: ఒక్క ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ ను కోరిన సీపీఐ

  • టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు
  • కొత్తగూడెం నుంచి గెలిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని
  • లోక్ సభ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని భావిస్తున్న సీపీఐ
CPI asking Congress for one Lok Sabha seat

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ గెలుపొందింది. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. 

మరోవైపు, లోక్ సభ ఎన్నికల్లో సైతం పొత్తులో భాగంగా పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ క్రమంలో ఒక ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని సీపీఐ కోరింది. ఖమ్మం, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని కాంగ్రెస్ ను కోరినట్టు కూనంనేని సాంబశివరావు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం, నల్గొండ, ఖమ్మం ఎంపీ స్థానాలకు సీపీఐ ప్రాతినిధ్యం వహించింది. 

ఇంకోవైపు, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు సీపీఐ, సీపీఎం కూడా భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పార్లమెంటు ఎన్నికల్లో తమతో పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.

More Telugu News