Lavu Sri Krishna Devarayalu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

  • గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు
Lavu Srikrishnadevarayalu joins TDP

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి వచ్చారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. 

చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు. 

ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. ఈ ఐదేళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనే అని వెల్లడించారు. తాను ఏ వేదికపైనా ఎవరినీ అతిగా పొగిడింది లేదు, ఎవరినీ అనవసరంగా విమర్శించిందీ లేదని అన్నారు. ఇకపైనా పల్నాడు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండడం తెలిసిందే.

More Telugu News