Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో బీఆర్ఎస్ చిప్ప పెట్టిపోయింది: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగుతోందంటే అందుకు ప్రధాని మోదీయే కారణమని వ్యాఖ్య
  • బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్‌లో చేరుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ప్రధాని మోదీని కలిస్తే వారు బీజేపీలో చేరుతున్నట్లా? అని ప్రశ్న
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టీకరణ
Konda Viswaswar Reddy blames brs for telangana debts

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో చిప్ప పెట్టిపోయిందని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగుతోందంటే అందుకు ప్రధాని మోదీయే కారణమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 65 శాతం మంది ముస్లింలు మోదీ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, అందుకే బీజేపీకే ఓటు వేయాలని అందరినీ తాము గర్వంగా అడుగుతామన్నారు.

గ్రామీణాభివృద్ధి మోదీ వల్లే సాధ్యమవుతోందన్నారు. రూ.9 వేల కోట్ల అప్పు ఇవ్వలేకపోతే తెలంగాణ రాష్ట్రం చీకట్లోకి వెళ్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేసి, అత్యధిక సీట్లలో గెలిపిస్తే మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీకి ఓటు వేయాలని అడగలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రచ్చ చేస్తున్నాయని... చర్యలు మాత్రం లేవని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేసి కేవలం మేడిగడ్డతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

సీఎంను కలిస్తే ఆ పార్టీలో చేరినట్లా?

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్‌లో చేరుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ప్రధాని మోదీని కలిస్తే వారు బీజేపీలో చేరుతున్నట్లా? అని ప్రశ్నించారు.

ఎవరితోనూ పొత్తు ఉండదు

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకు చేవెళ్ల టిక్కెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. టిక్కెట్ తనకు ఇస్తామని ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను కాపాడుతోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలను ఆ పార్టీ అధిష్ఠానం వినడం లేదన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఇక్కడి కాంగ్రెస్ నేతలు చెబుతున్నా ఆ పార్టీ ఢిల్లీ నేతలు అంగీకరించడం లేదన్నారు.

More Telugu News