Bonda Uma: సీట్ల పంపకం తొలి ప్రకటనకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది: బొండా ఉమ

  • ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
  • 118 అసెంబ్లీ సీట్లతో నేడు తొలి ప్రకటన చేసిన టీడీపీ, జనసేన
  • వైసీపీ అగ్రనేతల ప్యాంట్లు తడిశాయన్న బొండా ఉమ 
  • 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని ఎద్దేవా 
Bonda Uma counters YCP leaders comments

టీడీపీ-జనసేన కూటమి ఇవాళ సీట్ల పంపకంపై తొలి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలు, జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందన్నది నేటి ప్రకటన సారాంశం. టీడీపీ తన 94 మంది అభ్యర్థులను ఇవాళే ప్రకటించగా, జనసేన ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 

అయితే, ఈ ప్రకటనపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుండడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ-జనసేన కూటమి సీట్ల సర్దుబాటులో తొలి ప్రకటనకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని పేర్కొన్నారు. 

ఇవాళ 118 అసెంబ్లీ సీట్ల పంపకం ప్రకటన ఎంతో సాఫీగా జరిగిపోయిందని, వైసీపీలాగా కుదుపులేమీ లేవని బొండా ఉమ స్పష్టం చేశారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని చురక అంటించారు. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోయారని. జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

"ఇవాళ టీడీపీ-జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి. దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారు. పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల... జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలి. మా పొత్తులు, మా సీట్ల గురించి ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా? 

ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలి. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు... మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా? 

జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి. తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే 77 మందిని బలి చేశారు. మళ్లీ మళ్లీ మారుస్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘనవిజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడనకు స్వస్తి పలకడం ఖాయం" అంటూ బొండా ఉమ స్పష్టం చేశారు.

More Telugu News