Narendra Modi: ఎంపీ రామ్మోహన్ నాయుడు సహా 8 మంది ఎంపీలకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రధాని మోదీ

Prime Minister Modi gave a surprise to 8 MPs at the Parliament Canteen
  • పార్లమెంట్ క్యాంటీన్‌లో తనతో కలిసి భోజనం చేసే అవకాశమిచ్చిన ప్రధాని
  • ప్రధాని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని ఎంపీలకు సందేశం
  • ‘పదండి మీకు పనిష్మెంట్ ఉంది’ అంటూ క్యాంటీన్‌కు తీసుకెళ్లిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేర్వేరు పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలను పార్లమెంట్‌లో శుక్రవారం ఆశ్చర్యపరిచారు. అందరినీ సర్‌ప్రైజ్‌కు గురిచేస్తూ తనతో మధ్యాహ్న భోజనం చేసే అవకాశాన్ని కల్పించారు. బీజేపీ ఎంపీలు హీనా గవిత్, ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, ఎల్ మురుగన్‌లతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రలు ప్రధానితో కలిసి భోజనం చేశారు. ఈ అనూహ్య విందుతో ఎంపీలంతా ఆశ్చర్యచకితులయ్యారు.                                 

‘‘ప్రధాని మోదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’’ అంటూ ఎంపీలకు సందేశం అందింది. దీంతో ఎంపీలంతా మోదీ రూమ్‌కు వెళ్లారు. ఎంపీలను చూసిన మోదీ.. ‘‘పదండి. మీ అందరికీ శిక్ష విధించాలి’’ అంటూ క్యాంటీన్‌కు తీసుకెళ్లారు. తీరికలేని షెడ్యూల్స్, విదేశీ పర్యటనలు, గుజరాత్ రాష్ట్రంతో పాటు పలు అంశాలపై ప్రధాని మాట్లాడారని ఎంపీలు వివరించారు. 2015లో ప్రత్యేక రక్షణ బృందం (ఎస్‌పీజీ) అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారని ఓ ఎంపీ వెల్లడించారు. ప్రధానమంత్రితో భోజనం చేయడం గొప్ప అనుభవమని ఎంపీలు పేర్కొన్నారు. కాగా ఈ సర్‌ప్రైజ్ భోజనానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాలు, పార్టీలకు చెందిన  సహచర ఎంపీలతో  సంతృప్తికరంగా మధ్యాహ్న భోజనం చేశానని పేర్కొన్నారు.
Narendra Modi
Parliament
MPs
Ram manohar Naidu
BJP
Telugudesam

More Telugu News