V.V Lakshminarayana: సీఎం జగన్ ప్రభుత్వంపై ‘జై భారత్ పార్టీ’ అధినేత లక్ష్మీనారాయణ ఫైర్

  • అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ని ఎన్నికల ప్రచారం పర్వంలా మార్చారని ప్రభుత్వంపై మండిపడ్డ ‘జై భారత్ పార్టీ’ అధినేత
  • ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని ఆరోపణ
  • ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో నిజం ఎంత ఉందని ప్రశ్నించిన లక్ష్మీ నారాయణ
Jai Bharat Party chief Lakshminarayana criticices  CM Jagan government

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేసిందని సీఎం జగన్ సర్కారుపై ‘జై భారత్ పార్టీ’ అధినేత, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బుధవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా అంత అభివృద్ధి జరిగితే తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య ఎందుకు త‌గ్గడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యువ‌త ఉపాధి కోసం ఎందుకు వ‌ల‌స పోతున్నారని, రోడ్లు ఎందుకు వేయ‌డం లేదని మండిపడ్డారు. 

అప్పులు చేసి డ‌బ్బులు పంచిపెడితే పేద‌రిక నిర్మూల‌న ఎలా అవుతుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ. 4.25 ల‌క్షల కోట్ల న‌గ‌దు బదిలీతో పేద‌రికం తొలగించామంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రకటన చేసి ఆత్మవంచ‌న చేసుకున్నార‌ని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాస్తవం ఎంత అని అడిగారు. 43 ల‌క్షల మంది విద్యార్థుల‌కు గోరు ముద్ద, 35 ల‌క్షల మంది పిల్లల‌కు సంపూర్ణ పోష‌ణ అని లెక్కలు చెప్పారని, ఇవి ఎంతవరకు నిజమని మండిపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పందిస్తూ.. ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

More Telugu News