annamalai: తమిళనాడు కమలదళంలో ఉత్సాహం... బీజేపీలో 15 మంది మాజీ ఎమ్మెల్యేల చేరిక

  • వీరి చేరికతో తమిళనాడులో బీజేపీకి సీనియర్ల బలం పెరిగిందన్న అన్నామలై
  • తమిళనాడు ప్రజలు బీజేపీకి పట్టం కడతారని వ్యాఖ్య    
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని కేంద్రమంత్రి ధీమా
15 former AIADMK MLAs one ex MP join BJP

లోక్ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపును ఇచ్చే విషయం... ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం కమలం పార్టీలో చేరారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఢిల్లీలో వారు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడారు.

ఈ నాయకులు బీజేపీలో చేరడంతో తమిళనాడులో తమకు సీనియర్ నాయకత్వం దొరికిందన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని... ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు వీరు తమతో కలిశారన్నారు. తమిళనాడులో బీజేపీ బలంగా దూసుకు వెళుతోందన్నారు. తమిళనాడు ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇంతమంది నాయకులు బీజేపీలో చేరడం ప్రధాని మోదీకి దక్షిణాదిన ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. 

ముఖ్యంగా తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇక్కడ క్రమంగా బీజేపీ పెరుగుతోందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎంపీ సీట్లు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. గత పదేళ్లుగా జరుగుతోన్న అభివృద్ధి కొనసాగాలని దేశంలోని ప్రతి పౌరుడు భావిస్తున్నాడన్నారు.

More Telugu News