Revanth Reddy: ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాల్లో గందరగోళం: నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  • సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికారుల హాజరు
  • గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశం
  • పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy review on irrigation projects

ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో గందరగోళం కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో... ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అడిగారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరును అందించవచ్చునన్నారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News