ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ

500 Girl Students Claim Sexual Assault and Write To PM
  • ప్రొఫెసర్ తన చాంబర్‌లోకి పిలిపించి ప్రైవేటు భాగాలను తాకేవాడని ఆరోపణ
  • ప్రధానితోపాటు హర్యానా సీఎం, హోంమంత్రి, జాతీయ మహిళా కమిషన్, మీడియాకు లేఖలు
  • దర్యాప్తు ప్రారంభించిన సిట్
  • రాజకీయ ప్రేరేపితమన్న ప్రొఫెసర్
చౌదరి దేవీలాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది విద్యార్థినులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌కు లేఖ రాశారు. తమను వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను సస్పెండ్ చేయడంతోపాటు హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని లేఖలో వారు డిమాండ్ చేశారు. 

లేఖ కాపీని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అజ్మేర్‌సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు పంపారు.

ప్రొఫెసర్ తన చాంబర్‌లోకి అమ్మాయిలను పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, బాత్రూముకు తీసుకెళ్లి ప్రైవేటు భాగాలను తాకేవాడని ఆ లేఖలో విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవాడని వాపోయారు. కొన్ని నెలలుగా ఆయనిలా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యార్థినులు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొంతమంది నుంచి వివరాలు కూడా తీసుకున్నట్టు ఏడీజీ శ్రీకాంత్ జాదవ్ తెలిపారు. సిట్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి వాంగ్మూలాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రొఫెసర్‌పై విద్యార్థినుల వేధింపులు అవాస్తవమని తమ దర్యాప్తులో తేలినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ప్రొఫెసర్ కూడా ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. అవి రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
Go Back to Shorts
Chaudhary Devi Lal University
Haryana
University Girls
Sexual Assault

More Telugu News