Uttam Kumar Reddy: కర్ణాటక, తమిళనాడులకు బియ్యం విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • రేషన్ మాఫియా ఆగడాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి
  • గత ప్రభుత్వం బియ్యం విక్రయించలేదని విమర్శలు
Uttam Kumar Reddy review on civil supply corporation

రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం రిసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. హుజూర్ నగర్‌లోని ఓ రేషన్ దుకాణాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేషన్ బియ్యం రిసైక్లింగ్‌ను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందన్నారు. కానీ ఈ బియ్యాన్ని కొందరు గత ప్రభుత్వంలోని నాయకులు, అధికారుల అండదండలతో రీసైక్లింగ్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ మాఫియా ఆగడాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ అప్పు రూ.3,300 కోట్లుగా ఉండిందని, కానీ ఇప్పుడు వడ్డీ భారమే రూ.3వేల కోట్లుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఈ శాఖకు రూ.11వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. భారీ మొత్తంలో బియ్యం నిల్వలు ఉంచేందుకు మన వద్ద సరైన స్థలం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం నిల్వలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం విక్రయించకుండా గోదాములలోనే ఉంచిందని మండిపడ్డారు. తాము ఆ రాష్ట్రాలకు బియ్యం విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

More Telugu News