Kim Jong-un: మమ్మల్ని రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. ఉత్తరకొరియా అధినేత హెచ్చరిక

  • ఖండాంతర క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్‌కు హాజరైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్
  • అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగం
  • శత్రువులు తమను అణుదాడితో రెచ్చగొడితే తామూ అదే రీతిలో స్పందిస్తామని వార్నింగ్
Kim Jong Un Warns Of Nuclear Attack when Enemy Provokes It With Nukes

ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. కాగా, ఉత్తరకొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

More Telugu News