Chandrababu: అహంకారం వుంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం: చంద్రబాబు

  • మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు
  • జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన
  • ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్య
 We have seen in Telangana what happens when there is arrogance says Chandrababu

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని... అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని ఆయన అన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను ఈరోజు చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో ప్రభుత్వ తప్పుల గురించి ప్రశ్నిస్తే తనలాంటి వారిని కూడా జైల్లో పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చేయని తప్పుకు తనను జైల్లో పెట్టారని... ఎంతో మానసిక క్షోభను అనుభవించానని చెప్పారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని అన్నారు. 

దేశంలో ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయింది ఏపీలోనే అని చంద్రబాబు చెప్పారు. కరవు వల్ల సగం మంది రైతులు పంటలు వేయలేదని... పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే... నష్టపోయిన రైతులను 3 నెలల తర్వాత తాను ఆదుకుంటానని చెప్పారు. వరి రైతుకు ఎకరాకు రూ. 50 వేలకు పైనే నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లోనే నష్ట పరిహారం కింద రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చామని... ఇప్పుడు రూ. 30 వేలు ఇస్తే కానీ గిట్టుబాటు కాదని చెప్పారు. కౌలు రైతులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని చంద్రబాబు అన్నారు.

More Telugu News