Telangana: కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

  • మంత్రి ఉత్తమ్ సమక్షంలో పార్టీలో చేరిన శంకరమ్మ
  • శంకరమ్మకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శ
Srikantha Chary mother join Congress

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో ఆమె కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ... శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరువదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగినట్లు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేసి గెలిచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. అదానీ కాంగ్రెస్ మనిషి అన్నట్లు మోదీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

ఇండియా కూటమి కేంద్రంలో, అధికారంలోకి వస్తుందన్న సమాచారంతోనే మోదీ భయంతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News