Vasundhara Raje: కుమారుడి స్పీచ్‌కు మురిసిపోయిన వసుంధర రాజే.. ఇక తాను రిటైర్ అవ్వొచ్చని వ్యాఖ్య

  • ఝలావర్‌ నియోజకవర్గంలో జరిగిన సభలో రాజే ప్రసంగం
  • అంతకుమునుపు కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రసంగం విని హర్షం
  • సహచర ఎమ్మెల్యేలు తన కుమారుడికి మంచి తర్ఫీదు ఇచ్చారని వ్యాఖ్య
Vasundhara Raje elated after hearing song dushyant singhs speech

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన కుమారుడు దుష్యంత్ సింగ్ రాజే ప్రసంగం విని మురిసిపోయారు. ఇక తాను నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చని వ్యాఖ్యానించారు. దుష్యంత సింగ్ ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందుతున్న తీరుపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. జలావర్‌లో పార్టీ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సమావేశంలో ఆమె ప్రసంగించారు. 

‘‘నా కుమారుడు మాట్లాడింది విన్నాక నేను ఇక నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చని అనిపించింది. మీరందరూ అతడికి మంచి తర్ఫీదు ఇచ్చారు. ఇక అతడికి నేను దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. వారిపై పర్యవేక్షణ అవసరం లేకుండానే ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నారు’’ అని రాజే వ్యాఖ్యానించారు. 

ఝలావర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న రాజే నవంబర్ 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఝలావర్-బరన్ లోక్‌సభ నియోజకవర్గానికి దుష్యంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

More Telugu News