Eric Garcetti: దుర్గాదేవి మంటపం వద్ద 'ధునుచి' నృత్యం చేసిన అమెరికా రాయబారి గార్సెట్టి

  • దేశంలో దసరా నవరాత్రుల శోభ
  • ఢిల్లీలో చిత్తరంజన్ పార్కులో మంటపం ఏర్పాటు చేసిన బెంగాలీలు
  • భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీకి ఆహ్వానం
US Ambassador Eric Garcetti performs Dunuch Nach at Durga pandal in Delhi

భారత్ లో ప్రస్తుతం దసరా నవరాత్రుల శోభ వెల్లివిరిస్తోంది. విదేశీయులను సైతం విజయదశమి వేడుకలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా, భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. 

ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో బెంగాలీ ప్రజలు ఏర్పాటు చేసిన దుర్గా మంటపాన్ని ఎరిక్ గార్సెట్టి నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బెంగాలీ సంప్రదాయ 'ధునుచి' నృత్యాన్ని ఆచరించడం అందరినీ ఆకట్టుకుంది. నోటితో నిప్పుల కుంపటిని పట్టుకుని ఆయన నర్తించిన తీరు దుర్గా మంటపం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఇక, దుర్గా మంటపం వద్దకు విచ్చేసిన గార్సెట్టీకి రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఝాల్ మురి (మసాలా బొరుగులు), బిర్యానీ, ఫిష్ వంటకాలు, బెంగాలీ స్వీట్లను ఆయన ఇష్టంగా తిన్నారు. తన పర్యటన తాలూకు వీడియోను గార్సెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. శుభో పూజో అంటూ బెంగాలీలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

More Telugu News