Shikhar Dhawan: శిఖర్ ధావన్ కు విడాకులు మంజూరు చేసిన కోర్టు

  • భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్
  • సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం తీర్పు వెల్లడించిన జడ్జి
  • కొడుకు కస్టడీపై ఆస్ట్రేలియా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచన
Cricketer Shikhar Dhawan Gets Divorce On Grounds Of Cruelty By Wife

ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ కు ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని కోర్టు విశ్వసించింది. దీంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులకు గ్రౌండ్ ఆఫ్ క్రూయెల్టీ (క్రూరత్వం కారణంతో) కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. భార్య మానసిక పరిస్థితి నేపథ్యంలో కొడుకు కస్టడీని తనకే అప్పగించాలంటూ ధావన్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఆ బాలుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడంతో కస్టడీ కోసం అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించింది. అయితే, కొడుకును కలుసుకునేందుకు ధావన్ ను అభ్యంతరం పెట్టవద్దని, స్కూలు సెలవు దినాలలో సగం రోజులు తండ్రితో గడిపేందుకు బాలుడికి అవకాశం కల్పించాలని ధావన్ భార్యను ఆదేశించింది.

ఆయేషా ముఖర్జీ తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, వివాహం జరిగిన తర్వాత ఆస్తులను తన పేరు మీదికి మార్చాలని వేధించడం మొదలు పెట్టిందని శిఖర్ ధావన్ 2020లో కోర్టు కెక్కారు. తన కష్టార్జితంతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తుల విషయంలో తనను వేధించిందని ఆరోపించాడు. అందులో ఒక ఆస్తిని ఆయేషా సొంతం చేసుకోగా మిగతా రెండు ఆస్తులు తమ ఇద్దరి పేరు మీద ఉన్నాయని వివరించాడు. మిగతా రెండు ఆస్తులను కూడా తన పేరు మీదికి మళ్లించాలని గొడవ పడేదని చెప్పాడు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం ధావన్ కు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

More Telugu News