ఖలిస్థాన్ ముఠాలపై ఉక్కు పాదం.. దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

NIA Raids at 50 locations across 6 states in crackdown on Khalistani gangster nexus
  • ఖలిస్థాన్, పాక్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య బంధంపై సమాచారం
  • ఆరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు
  • ముఠాలను ఏరిపారేయడమే లక్ష్యం
ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. వీరిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎన్ సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపించిన తర్వాత.. కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు మరింత చురుగ్గా మారడం తెలిసిందే.

ఖలిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల  మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం ఎన్ఐఏకి అందినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాదులకు నిధుల సాయం, ఆయుధాల సరఫరాకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకి అందినట్టు తెలిసింది. దీంతో పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని 13 ప్రాంతాల్లో, హర్యానాలో నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం. 

ఈ ముఠాలు కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, ఆయుధాల స్మగ్లింగ్, దోపిడీ, హత్యలు, ప్రభుత్వ భవనాలపై దాడులు వంటి చర్యలు చేపడుతున్నట్టు ఎన్ఐఏకి సమాచారం అందింది. దీంతో ఆయా ముఠాలను ఏరిపారేయడానికి ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.
Go Back to Shorts
NIA
Raids
50 locations
Khalistani gangster

More Telugu News