USB-C Charger: ఈయూ దేశాలకు తలొగ్గిన ‘యాపిల్’

  • ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లను ఆవిష్కరించిన యాపిల్
  • కొత్త మోడళ్లలో లైట్నింగ్ చార్జర్‌కు బదులు యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్
  • అంతర్జాతీయ ప్రామాణికంగా మారిన యూఎస్‌బీ-సీ వైపు మళ్లినట్టు యాపిల్ ప్రకటన
  • సెల్‌ఫోన్లలో యూఎస్‌బీ-సీ తప్పనిసరి చేయాలన్న ఈయూ దేశాల ప్రయత్నాలు సఫలం
Apple Bows To EU And Unveils iPhone With USB C Charger

ఈయూ దేశాల ఒత్తిడికి యాపిల్ ఎట్టకేలకు తలొగ్గింది. తాజాగా విడుదల చేసిన కొత్త ఐఫోన్ మోడళ్లలో లైట్నింగ్ చార్జర్ పోర్టులకు బదులు యూఎస్‌బీ చార్జింగ్ పోర్టులను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో యూఎస్‌బీ-సీ చార్జింగ్ సదుపాయం ఉండాలని ఐరోపా దేశాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి యూఎస్‌బీ నిబంధనను ఈయూ తప్పనిసరి చేసింది. దీని వల్ల వినియోగదారులకు డబ్బులు ఆదా అవుతాయని పేర్కొంది.

అయితే, యాపిల్ మాత్రం తొలి నుంచి యూఎస్‌బీలను వ్యతిరేకిస్తోంది. తను సొంతంగా అభివృద్ధి చేసిన చార్జింగ్ విధానంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించామని చెుబుతోంది. యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ కూడా యాపిల్ చార్జింగ్ ఉపకరణాన్నే వినియోగిస్తోంది. కానీ, ఈయూ దేశాలు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో యాపిల్‌ తన పట్టువీడక తప్పలేదు. 

కాగా, యాపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటూ యాపిల్ వాచ్‌ కొత్త మోడళ్లనూ ఆవిష్కరించింది. ‘వండర్ లస్ట్’ పేరిట అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా యూఎస్‌బీ-సీ చార్జింగ్ సదుపాయం ఉన్న ఫోన్లను ఆవిష్కరించింది. ‘‘యూఎస్‌బీ-సీ కేబుల్ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ప్రామాణిక విధానం కావడంతో ఐఫోన్-15 సిరీస్‌లో దీన్ని చేర్చాం’’ అని యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ మార్కెటింగ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ కయాన్ డ్రాన్స్ పేర్కొన్నారు. 

మరోవైపు, ఐఫోన్ అమ్మకాలు నానాటికీ తగ్గిపోతుండటంతో యాపిల్‌లో ఆందోళన నెలకొంది. అధిక ధరల కారణంగా వినియోగదారులు కొత్త ఐఫోన్ మోడళ్ల కొనుగోలును వాయిదా వేస్తుండటం కంపెనీపై ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం కూడా యాపిల్‌ను సంకటంలోకి నెట్టేసింది. చైనా ప్రభుత్వాధికారులు ఐఫోన్లను వాడొద్దంటూ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. 

More Telugu News