నాలుగు గంటలుగా టీడీపీ అధినేతపై సీఐడీ ప్రశ్నల వర్షం... చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు
- చంద్రబాబును ఐదో ఫ్లోర్లో విచారిస్తోన్న సీఐడీ బృందం
- టీడీపీ అధినేతకు 20కి పైగా ప్రశ్నలు సంధించిన సీఐడీ
- ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలో కొనసాగుతున్న విచారణ
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో నాలుగో ఫ్లోర్లో చాలాసేపు వేచి చూసి, చివరకు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలిశారు. నారా లోకేశ్, భువనేశ్వరి రెండు గంటలకు పైగా వేచి చూశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి కూడా సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ధర్మం తనవైపే ఉందని, కుట్రపూరిత రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటానని, ఆందోళన చెందవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబును చూసిన తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి అక్కడి నుండి వెళ్లిపోగా, బాలకృష్ణ, లోకేశ్ అక్కడే ఉండిపోయారు.
హైదరాబాద్లో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.