Chandrababu Arrest: చంద్రబాబు బయటపడడం కుదరదు.. ఆ రోజులు పోయాయి: సజ్జల

  • ఆర్థిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సిన పనిలేదన్న సజ్జల
  • ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయన్న ప్రభుత్వ సలహాదారు
  • ఆ తర్వాత ఏం జరగాలన్నది కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టీకరణ
Sajjala Ramakrishna Reddy Press Meet On Chandrababu Arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుపై కేసు ఇప్పుడే నమోదు కాలేదని, 9 డిసెంబరు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సీఐడీ సిట్ అధికారులు ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. 

తనపై నేరారోపణ బలంగా ఉందని, అరెస్ట్ చేస్తారని కూడా చంద్రబాబుకు తెలుసని అన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు చెబుతున్నారని, కాగ్నిజబుల్ అఫెన్స్, ఆర్థిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అక్రమంగా రిలీజ్ చేసిన రూ.370 కోట్లలో రూ. 241 కోట్లు షెల్ కంపెనీల ద్వారా డైవర్ట్ అయినట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ పేర్కొందని గుర్తు చేశారు.  

దర్యాప్తులో రాజకీయ ప్రమేయం ఉండొద్దన్న ఉద్దేశంతోనే రెండేళ్ల తర్వాత దర్యాప్తు అనంతరం చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత ఏం జరగాలన్నది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. చేసిన తప్పుల నుంచి బయటపడాలంటే కుదరదని, ఆ రోజులు పోయాయని సజ్జల తేల్చి చెప్పారు.

More Telugu News