Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులు అంటూ జాతీయ మీడియాలో కథనాలు... విజయసాయిరెడ్డి స్పందన

  • చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఆరోపణలు
  • చంద్రబాబు ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన ఐటీ శాఖ
  • సెంట్రల్ సర్కిల్లో కేసు
  • 153సీ సెక్షన్ కింద నోటీసులు
Vijayasai Reddy reacts on IT notice to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది! పలు మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు ప్రాథమిక అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్టు తెలుస్తోంది. 

ఐటీ శాఖ సెంట్రల్ సర్కిల్ లో కేసు నమోదైందని, 153సీ సెక్షన్ కింద నోటీసులు పంపినట్టు ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్నారు. కొన్ని బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఈ లెక్కాపత్రం లేని నగదు చంద్రబాబుకు ముట్టినట్టు ఐటీ శాఖ చెబుతోంది. ఇది అప్రకటిత ఆదాయంగా ఐటీ శాఖ అభివర్ణించింది. 

ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలన్నా కుదర్లేదని వెల్లడించారు. అడ్డంగా బుక్కైనా సరే బుకాయించడం బాబు గారి నైజం అని విజయసాయి విమర్శించారు. 

More Telugu News