Manda Krishna Madiga: మీ స్టాండ్‌ను బట్టి మా స్టాండ్ ఉంటుంది: మంద కృష్ణ మాదిగ

  • కాంగ్రెస్ మాకు మద్దతిస్తే వారికి తాము అండగా ఉంటామన్న మంద కృష్ణ
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బిల్లు పెట్టమంటే పెట్టలేదని ఆరోపణ
  • ప్రతిపక్ష హోదాలో ప్రధానికి లేఖ రాయమని తొమ్మిదేళ్లుగా కోరుతున్నానన్న మంద కృష్ణ
Manda Krishna Madiga demands for sc categorisation

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే తాము ఆ పార్టీకి అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ నెల 18వ తేదీన కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ డిక్లరేషన్‌పై మంద కృష్ణతో కాంగ్రెస్ చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ డిక్లరేషన్‌పై అభిప్రాయాల కోసం పిలిచినట్లు చెప్పారు.

వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతిస్తేనే అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయమన్నా రాయడం లేదన్నారు. తాను తొమ్మిదేళ్లుగా వీరిచుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టవచ్చు కదా అన్నారు. అలాంటప్పుడే ఆ పార్టీకి మద్దతివ్వగలమన్నారు.

ప్రధానికి లేఖ రాయాలని, ప్రైవేటు బిల్లు మూవ్ చేయాలని కాంగ్రెస్‌ను కోరుతున్నానన్నారు. ప్రతిపక్షంలో ఉండి వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెట్టకుంటే కాంగ్రెస్‌ను ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. వర్గీకరణపై వారి స్టాండ్‌ను బట్టి తమ స్టాండ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News