YSRCP: రిషికొండపై నిర్మిస్తున్నది సెక్రటేరియట్ కాదు: వైఎస్సార్‌‌సీపీ ట్వీట్

  • రిషికొండపై సచివాలయం కడుతున్నట్లు నిన్న వైసీపీ ట్వీట్
  • తీవ్ర విమర్శలు రావడంతో ట్వీట్ డిలీట్
  • అక్కడ చేపట్టినవి ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమేనని తాజాగా వెల్లడి
ysrcp another tweet on rushikonda

విశాఖపట్నంలోని రిషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైఎస్సార్‌‌సీపీ క్లారిటీ ఇచ్చింది. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నట్లు శనివారం రాత్రి ట్వీట్ చేసిన వైసీపీ.. తీవ్ర విమర్శలు రావడంతో ఆదివారం మరో ట్వీట్ చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయం కాదని, కేవలం ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమేనని చెప్పింది.

‘‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా వైఎస్ జగన్ ప్రకటించారు. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు” అని నిన్న ఓ ట్వీట్‌లో ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించింది. ఈ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను టీడీపీ షేర్ చేసి.. ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించింది.

దీంతో స్పందించిన వైఎస్సార్‌‌సీపీ.. ‘‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు” అని పేర్కొంది.

‘‘మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది” అని వివరణ ఇచ్చింది.

More Telugu News