Team India: విండీస్ కెప్టెన్ మెరుపుదాడి... టీమిండియా ముందు ఓ మోస్తరు లక్ష్యం

West Indies set 160 runs target to Team India in 3rd T20I
  • గయానాలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు
  • 19 బంతుల్లో 40 పరుగులు చేసిన కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ 
  • పూరన్ కు కళ్లెం వేసిన కుల్దీప్
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. 

విండీస్ జట్టులో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 45, కైల్ మేయర్స్ 25 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ ఎడాపెడా బాదుడు మొదలుపెట్టినా, టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో జాన్సన్ చార్లెస్ (12), పూరన్ లను అవుట్ చేసి విండీస్ జోరుకు కళ్లెం వేశాడు. పూరన్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 

చివర్లో కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ ధాటిగా ఆడడంతో విండీస్ స్కోరు 150 మార్కు దాటింది. పావెల్ 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.
Team India
West Indies
Target
3rd T20I

More Telugu News