Bharathi Cements: జగన్ అక్రమాస్తుల కేసు.. భారతి సిమెంట్స్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

  • భారతి సిమెంట్స్ ఎఫ్ డీలను గతంలో స్వాధీనం చేసుకున్న ఈడీ
  • ఎఫ్ డీలను వెనక్కి ఇచ్చేయాలంటూ టీఎస్ హైకోర్టు ఆదేశాలు
  • హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఈడీ
Supreme Court stays TS High Court orders in Bharathi Cements case

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా భారతీ సిమెంట్స్ కు చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లను గతంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఈడీకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో, టీఎస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలను వినిపించారు. 

ఈ కేసుకు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు లేదా ఎఫ్ డీ లలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు చెప్పిందని... దీంతో, ఎఫ్ డీ లనే ఈడీ ఎంచుకుందని ధర్మాసనానికి ఎస్వీ రాజు తెలిపారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా కల్పించుకుంటూ... మీరు ఎఫ్ డీలను నగదుగా మార్చుకున్నారని ప్రతివాదులు చెపుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని... దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. ఎఫ్ డీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునే విషయాన్ని ప్రతివాదులకే వదిలేస్తున్నామని చెప్పారు.

More Telugu News