Chandrababu: రౌడీయిజం చేస్తే తాటతీస్తా: చంద్రబాబు హెచ్చరికలు

  • వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో తయారవుతున్నాడన్న చంద్రబాబు
  • రోడ్డుకు మట్టి వేయలేరు.. 3 రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా
  • వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప న్యాయం జరగదని వ్యాఖ్య
  • ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటన
tdp chief chandrababu fires on cm jagan

వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో తయారవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానని హెచ్చరించారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఈ రోజు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. నందికొట్కూర్‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానని చెప్పారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని మండిపడ్డారు. సీమ కోసం జగన్ ఏనాడైనా పని చేశారా? అని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. 

మూడు రాజధానులపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ 3 రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులని అంటున్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని అన్నారు.

More Telugu News