ఫేస్బుక్ ప్రేమ.. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి
- 20 రోజుల క్రితం అరిమాకులపల్లె వచ్చిన విఘ్నేశ్వరి
- ఆలయంలో వివాహం జరిపించిన పెద్దలు
- వచ్చే నెల 6వ తేదీ వరకు వీసా గడువు
- ఆలోగా వెళ్లిపోవాలంటున్న పోలీసులు
శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరికి చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అదికాస్తా ముదిరి ప్రేమకు దారితీసింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించిన విఘ్నేశ్వరి 20 రోజుల క్రితం ప్రియుడిని వెతుక్కుంటూ అరిమాకులపల్లె వచ్చింది. విషయం తెలిసిన పెద్దలు 15 రోజుల క్రితం ఆలయంలో వివాహం జరిపించారు.
గ్రామానికి చెందిన యువకుడు శ్రీలంక యువతిని పెళ్లాడిన విషయం ఆనోటా ఈనోటా పడి పోలీసులకు చేరింది. వెంటనే వారు గ్రామానికి చేరుకుని యువతి వీసాను పరిశీలించారు. ఆమె వద్ద సరైన పత్రాలు ఉండడం, వీసా గడువు వచ్చే నెల 6 వరకు ఉండడంతో ఆలోగా దేశం విడిచి వెళ్లాలని చెబుతూ నోటీసులిచ్చారు. యువతిని రిజిస్టర్ వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాలని యువకుడి తల్లిదండ్రులను కోరారు.