Electricity Employees: సమ్మెకు సిద్ధమైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు.. 24 ఏళ్ల తర్వాత తొలిసారి

  • వేతన సవరణ సహా 12 డిమాండ్లు
  • గురువారం నుంచే ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
  • సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానం
  • సమస్యలు పరిష్కారం కాకుంటే ఆగస్టు 10 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం
AP Electricity Employees Ready To Go For Strike

ఏపీలోని విద్యుత్ ఉద్యోగులు 24 ఏళ్ల తర్వాత సమ్మెకు సిద్ధమయ్యారు. వేతన సవరణ సహా 12 డిమాండ్లతో గురువారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టిన ఉద్యోగులు నిన్న కూడా కొనసాగించారు. సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ నిరసన ప్రదర్శనల్లో చేరాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా నిర్ణయించారు.

ఉద్యోగుల నిరసనలపై స్పందించిన ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చర్చిద్దామని, గుణదల విద్యుత్ సౌధలోని ఏపీపీసీసీ చైర్మన్ చాంబర్‌కు పదిమంది నేతలు రావాలని కబురుపెట్టింది. అయితే, ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి వచ్చేంత వరకు నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని, ప్రభుత్వం మొండికేస్తే ఆగస్టు 10 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించారు. కాగా, 1999లో వేతన సవరణ సహా ఇతర డిమాండ్ల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మళ్లీ ఇన్నేళ్లకు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

More Telugu News