Kuppam: కుప్పంలో తెల్లవారుజామున ఓ ఇంట్లో నాటు బాంబు పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

  • పేలుడు ధాటికి ధ్వంసమైన ఇల్లు
  • ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మురుగేశ్, ధనలక్ష్మి దంపతులు
  • గుర్తు తెలియని వ్యక్తులు బాంబును పేల్చారంటున్న స్థానికులు
Bomb blast in Kuppam

కుప్పంలో తెల్లవారుజామున 4 గంటలకు ఒక ఇంట్లో నాటు బాంబు పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఒక ఇంట్లో బాంబు పేలింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమయింది. ఈ ఘటనలో ఇంట్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు మురుగేశ్, ధనలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. వారి ఇద్దరు పిల్లలు మాత్రం ముప్పు నుంచి తప్పించుకున్నారు. పేలుడు శబ్దంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు.

వెంటనే స్థానికులు పేలుడు గురించి కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. మరోవైపు పేలుడుపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలింది నాటుబాంబా? లేక జిలెటిన్ స్టిక్సా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు ముందు నాటు బాంబును పేల్చినట్టు కొందరు చెపుతున్నారు. కుప్పంలో వారం వ్యవధిలో పేలుళ్లు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

More Telugu News