Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Low pressure will form in northwest Bay of Bengal in 24 hours
  • ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురు గాలులు
  • సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దు..
  • మత్స్యకారులకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వార్నింగ్
నైరుతి రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, నైరుతి వైపుగా సాగుతోందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉందని, చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
Bay of Bengal
Low pressure
Andhra Pradesh
rains

More Telugu News