Kalava Srinivasulu: జగన్ దొంగతెలివితేటలకు అతిపెద్ద నిదర్శనం ఈ భూదోపిడీ: కాలవ శ్రీనివాసులు

  • లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశంలో కాలవ శ్రీనివాసులు ప్రెస్ మీట్
  • రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం
  • నాలెడ్జ్ హబ్ భూములను కొట్టేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపణ
  • 8,864 ఎకరాలు బలైపోయాయని వెల్లడి
Kalava Srinivasulu fires on Jagan

జగన్ దొంగతెలివితేటలు, భూ కుంభకోణాలకు అతిపెద్ద నిదర్శనం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలని ఆశ చూపి, రైతుల నోట్లో మట్టి కొట్టి, వారి పిల్లల జీవితాల్ని రోడ్డున పడేసి, అంతిమంగా నాలెడ్జ్ హబ్ భూముల్ని కొట్టేయడానికి ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

అనంతపురం జిల్లాలోని రైతులకు చెందిన 8,864 ఎకరాల భూములు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో బలైపోయాయని వివరించారు. కుంభకోణాలు ఎలా చేయాలో జగన్ కు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికీ తెలియదనడానికి ఈ భూదోపిడీనే నిదర్శనమని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

"రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్ పేరుతో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.1.50లక్షల వరకు రైతులకు తూతూమంత్ర పరిహారమిచ్చి, కొట్టేసిన వేల కోట్ల విలువైన భూముల్ని స్వాహా చేసేందుకు జగన్ సిద్ధమయ్యాడు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని తాకట్టు పెట్టి ఒకసారి, అమ్ముకొని మరోసారి జగన్ విపరీతమైన లబ్దిపొందాడు. 

8,864 ఎకరాల భూముల్ని రాజశేఖర్ రెడ్డి ఇందూ ప్రాజెక్ట్స్ కి కట్టబెట్టారు. ఆ భూముల్ని తాకట్టు పెట్టి, సదరు ఇందూప్రాజెక్ట్స్ సంస్థ యాజమాన్యం, లేపాక్షి నాలెడ్జ్ హబ్ వారు రూ.4631 కోట్ల రుణం పొందారు. ఒక ప్రాజెక్ట్ పేరుతో ఉండే భూముల్ని చూపించి, మరో సంస్థ తాకట్టు పెట్టి రుణం పొందడం ఇక్కడే జరిగింది. 

భూముల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న సంస్థ అక్కడ ఎలాంటి పనులు చేపట్టి, వాటిని అభివృద్ధి చేయకపోగా, జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు నిధులు మళ్లించి, క్విడ్ ప్రోకోకు పాల్పడింది. బ్యాంకుల నుంచి భూముల్ని కొట్టేయడానికి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు డైరెక్టర్ గా ఉన్న ఎర్తిన్ అనే అనామక కంపెనీని జగన్ తెరపైకి తెచ్చాడు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని ఎర్తిన్ కు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం పరుగులు పెట్టిందంటే దాని వెనుక జగన్ హస్తముండబట్టే. 

ఎర్తిన్ కంపెనీ డైరెక్టర్ల జాబితాలో అందరూ జగన్మోహన్ రెడ్డి బంధువులే. జగన్ వేలువిడిచిన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు నరేన్ రామాంజులరెడ్డి ఎర్తిన్ సంస్థలో డైరెక్టర్ గా చేరాకే, లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని, సదరు సంస్థకు ధారాదత్తం చేసే ప్రయత్నాలకు సంబంధించిన ఫైళ్లు చకచకా ముందుకు కదిలాయి. 

రూ.18 వేల కోట్లనుంచి రూ.20 వేల కోట్ల విలువైన భూముల్ని కేవలం రూ.500 కోట్లకు ఒక అనామక కంపెనీకి ధారాదత్తం చేయడానికి అధికారయంత్రాం గం పరుగులుపెట్టిందంటే దానివెనకాల ముఖ్యమంత్రి జగన్ హస్తం లేదని చెప్పగలమా? 

వైసీపీ నాయకత్వం, జగన్ దోపిడీ గ్యాంగ్ ఎంత నీచ స్థితికి దిగజారారో ఈ వ్యవహారంతోనే అర్థమవుతోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాలు తక్షణమే స్పందించాలి" అని కాలవ శ్రీనివాసులు వివరించారు.

More Telugu News