Sharmila: ఈ సామెత అబద్ధాల కేసీఆర్ కు సరిపోతుంది: షర్మిల

  • సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన షర్మిల
  • కష్టం ఒకరిదైతే ప్రచారం మరొకరిదని వ్యాఖ్యలు
  • నాడు వైఎస్సార్ జలయజ్ఞం కింద పునాదులు వేశారని వెల్లడి
  • కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులు అవేనని స్పష్టీకరణ
Sharmila take a swipe at CM KCR

పాలమూరు కన్నీళ్లను చూసి వైఎస్సార్ సాగునీళ్లు ఇచ్చాడని, కానీ తట్టెడు మట్టి మోయని కేసీఆర్ తానే జలకళ తెచ్చినట్టు గప్పాలు కొట్టుకుంటున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కష్టం ఒకరిదైతే... ప్రచారం మరొకరిది అనే సామెత అబద్ధాల కేసీఆర్ కు సరిపోతుందని పేర్కొన్నారు. 

"అందుకే అంటారు... సొమ్మొకడిది-సోకొకడిది అని. ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పే దద్దమ్మ గారు... పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా?" అని షర్మిల సవాల్ విసిరారు.

నాడు వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులే... నేడు కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగనీరు ఇచ్చే ప్రాజెక్టులు అని స్పష్టం చేశారు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు గట్టు, తుమ్మిల్ల, సంగంబండ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు అని షర్మిల వివరించారు. 

వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే... మీ పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొరగారూ? అని ఆమె ప్రశ్నించారు. "పాలమూరు-రంగారెడ్డి పేరు చెప్పి రూ.35 వేల కోట్లు మెక్కారే తప్ప ఒక్క ఎకరాను తడిపింది లేదు. వైఎస్సార్ బతికుంటే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేది. వెనుకబడ్డ జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరు చెప్పి కమీషన్లు దండుకున్న దొంగ కేసీఆర్" అని షర్మిల మండిపడ్డారు. 

మహానేత హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే...  నేడు ఇరిగేషన్ పక్కనబెట్టి మైగ్రేషన్ వైపే మళ్లించేలా ఉంది దొర కేసీఆర్ పాలన అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా వలసలు ఆగలేదని వెల్లడించారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీద ఉన్న ప్రేమ పాలమూరు మీద లేకపోయింది... ఉద్యమ సమయంలో పార్లమెంటుకు పంపిన గడ్డ అని ఏనాడో మర్చిపోయాడు అని విమర్శించారు.

More Telugu News