Bopparaju Venkateswarlu: ఏపీ జేఏసీ అమరావతి ఎప్పుడూ పాత పెన్షన్ విధానానికే కట్టుబడి ఉంటుంది: బొప్పరాజు

  • ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పోరాడాలన్న బొప్పరాజు
  • ఎప్పుడు పోరాటం చేసినా తాము అండగా ఉంటామని వెల్లడి
  • వాట్సాప్ ఉద్యమాలు మానుకోవాలని హితవు
Bopparaju says AP JAC Amaravati stands for old pension scheme

డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల నాయకత్వాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, అలాంటి ఐక్య ఉద్యమాలతోనే సత్ఫలితాలు వస్తాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీ జేఏసీ ఎప్పటికీ కూడా పాత పెన్షన్ విధానానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఉద్యోగులు ఎప్పుడు పోరాటం చేసినా తాము వారి వెంట నిలిచామని, ఇంతకుముందు ఉన్నాం, ఇకపైనా వెంట నడుస్తామని అన్నారు. ఈ విషయంలో తాము ఎప్పటికీ వెనుకంజ వేయలేదని తెలిపారు. 

"కానీ మీరే... ఎవరైతే ద్రోహం చేస్తారో, ఎవరైతే నష్టం చేస్తారో... వారి వెంటే నడుస్తున్నారు. దయచేసి వాట్సాప్ ఉద్యమాలు మానండి. వాట్సాప్ ఉద్యమాలు చేస్తేనో, మమ్మల్ని నిందిస్తేనో సమస్యలు పరిష్కారం కావు. అవసరమైనప్పుడు ఉద్యమాలకు సిద్ధం కండి... మన సమస్యలు పరిష్కరించుకునే బాధ్యత మేం తీసుకుంటాం. 

92 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఉద్యమాలు జరిగాయి. 47 డిమాండ్లకు గాను 37 డిమాండ్లకు లిఖిత పూర్వక పరిష్కారం లభించింది. వీటికి ఉత్తర్వులు కూడా వచ్చాయి. కొన్ని డిమాండ్లకు కేబినెట్ ఆమోదం కూడా తీసుకున్నాం. మన డిమాండ్లలో 80 శాతం మేర సాధించుకున్నాం. మిగిలిన పది డిమాండ్ల విషయానికొస్తే, సంబంధిత సెక్రటరీ వద్ద చర్చలకు వెళ్లాలి. ఇదే నమ్మకంతో ముందుకెళదాం" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

More Telugu News