Praja shanti: మా పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పోస్టు.. పొంగులేటికి కేఏ పాల్ బంపర్ ఆఫర్

  • ఖమ్మంలో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు బాధ్యత కూడా..
  • ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూపల్లిలకూ పాల్ ఆహ్వానం
  • సీఎంగా ఆరు నెలలు మాత్రమే ఉంటానన్న కేఏ పాల్
Praja shanti party president ka paul offered deputy cm post for ponguleti srinivas reddy

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని తెలంగాణలో దాదాపుగా అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన మాత్రం ఏ పార్టీలో చేరతారనేది అంతుచిక్కడంలేదు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో పొంగులేటికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో ఆయన చెప్పిన వారికే పార్టీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఉప ముఖ్యమంత్రి పోస్టులో కూర్చోబెడతానని చెప్పారు. పొంగులేటితో పాటు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను కూడా తన పార్టీలోకి ఆహ్వానించారు. తన మాట కాదని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగితే ఓటమి తప్పదని కేఏ పాల్ హెచ్చరించారు. 

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆరు నెలలు మాత్రమే తాను పదవిలో కొనసాగుతానని కేఏ పాల్ చెప్పారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచ దేశాల నుంచి నేతలను, మిలియనీర్లను ఆహ్వానించి, ఖమ్మం జిల్లాలో 10 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పాల్ పేర్కొన్నారు. పెన్షన్లు, రైతుబంధు, నిరుద్యోగ భృతిని డబుల్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు.

More Telugu News