గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ కీలక సూచనలు

TSPSC Issues Guidelines to Candidates Who Appearing for Group 1 Exam
  • పదిహేను నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్
  • ఓఎంఆర్ పేపర్ లో తప్పులకు అభ్యర్థిదే బాధ్యత, మరొకటి ఇవ్వలేమని వెల్లడి
  • ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డుతో ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సలహా
గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది. పరీక్షకు పదిహేను నిమిషాల ముందే గేట్లు బంద్ చేస్తామని, ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఓఎంఆర్ షీట్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలని కమిషన్ సూచించింది. ఆ సమయంలో దొర్లే పొరపాట్లకు అభ్యర్థులదే బాధ్యత అని, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్ నింపాలని, బబ్లింగ్ సరిగ్గా చేయాలని సూచించింది. బబ్లింగ్ సరిగ్గా లేకున్నా, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ తో బబ్లింగ్ చేసినా.. సదరు ఓఎంఆర్ షీట్లు చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. 

పరీక్షా కేంద్రానికి వచ్చేటపుడు హాల్ టికెట్, ఆధార్, పాన్ కార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు వెంట తీసుకొని రావాలని స్పష్టం చేసింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని హెచ్చరించింది.
Advertisement
TSPSC
Guidelines
Group 1 Exam
Candidates

More Telugu News