Haryana: షాకింగ్.. తమ్ముడిని గొంతు నులిమి చంపేసిన మైనర్ బాలిక!

  • హరియాణాలో వెలుగు చూసిన ఘటన
  • తమ కుమారుడికి ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులు 
  • అతడు ఫోన్‌లో ఆడుకుంటుండగా తనకోసారి ఫోన్ ఇవ్వమన్న అక్క
  • అతడు కుదరదని అనడంతో గొంతు నులిమి హత్య
  • తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని బాలిక భావించినట్టు చెప్పిన పోలీసులు
Minor girl in Haryana strangles younger brother as she felt parents loved him more

తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని బలంగా నమ్మిన ఓ మైనర్ బాలిక దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తమ్ముడితో గొడవపడి క్షణికావేశంలో గొంతు నులిమి చంపేసింది. హరియాణాలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక, ఆమె తమ్ముడు ఉత్తరప్రదేశ్‌లో తమ నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. ఇటీవల వేసవి సెలవుల కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. 

ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు తన ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. అతడు కుదరదని అనడంతో ఆమె తన తమ్ముడి గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు, నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి నిర్ఘాంతపోయారు. కూతురిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News