Swiggy: ‘ట్రోఫీని బిర్యానీ గెలుచుకుంది’.. స్విగ్గీకి నిమిషానికి 212 ఆర్డ‌ర్లు వచ్చాయట!

  • ఐపీఎల్ సీజన్ ను క్యాష్ చేసుకున్న స్విగ్గీ
  • తమకు ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడి
  • 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ అందుకున్నట్లు ట్వీట్
biryani reigns supreme with 212 orders per minute this ipl season says Swiggy

రెండు నెలలపాటు క్రికెట్ లవర్స్ ను అలరించిన ఐపీఎల్.. అదిరిపోయే క్లైమాక్స్ తో ముగిసింది. సోమవారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ పోరులో గుజ‌రాత్ టైటాన్స్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడించి.. క‌ప్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గీకి వచ్చిన బిర్యానీ ఆర్డర్లు ఒకెత్తు.

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో బిర్యానీకి అత్య‌ధికంగా ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు స్విగ్గీ ప్ర‌క‌టించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు వెల్లడించింది. అయితే వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానా? అనే విష‌యంపై స్విగ్గీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. కానీ ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించింది.

2023 న్యూ ఇయర్ రోజు రాత్రి.. ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడుపోయాయని స్విగ్గీ ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ నుంచి 75.4 శాతం బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్ పోల్లో తేలింది. ఆ తర్వాతి స్థానంలో లక్నో (14.2 శాతం), కోల్కతా (10.4 శాతం) ఉన్నాయి.

మరోవైపు ఐపీఎల్ సీజన్ ను స్విగ్గీ బాగానే క్యాష్ చేసుకుంది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. ముంబయితో ఎలిమినేటర్ పోరులో లక్నో ఓడిపోవడంతో.. ‘‘అబ్బాయిలూ టెన్షన్ పడకండి.. మేము లక్నోలో టిష్యూలను రీస్టాక్ చేయడం ప్రారంభించాం’’ అంటూ ట్రోల్ చేసింది.

ఇక నిన్నటి ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల మ్యాచ్ పదే పదే ఆగిపోతుండటంపై ‘‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారు?’’ అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. ఇలా క్రికెట్ ను, ఫుడ్ తో ముడిపెడుతూ ట్వీట్లు చేసింది.  

More Telugu News