Ravindra Jadeja: మహీ భాయ్‌.. నీ కోసం ఏదైనా సరే..: రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్

  • గుజరాత్ ను ఓడించి ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేతగా నిలిచిన చెన్నై
  • చివరి 2 బంతుల్లో 10 పరుగులు కొట్టి గెలిపించిన జడేజా
  • తన కెప్టెన్ ధోనీని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టిన జడ్డూ
Ravindra Jadeja Breaks Internet With Post For MS Dhoni

చివరి బంతి దాకా జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ ను ఓడించి ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేతగా నిలిచింది చెన్నై. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. 6, 4 మ్యాచ్ ను గెలిపించాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విజయాన్ని తన కెప్టెన్ కు కానుకగా అందించాడు.

ఈ నేపథ్యంలో ధోనీని ఉద్దేశించి ట్విట్టర్ లో జడేజా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ‘‘ఇది కేవలం ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్‌ నీ కోసం ఏదైనా సరే..’’ అని రాసుకొచ్చాడు. రెండు హార్ట్ సింబల్స్ ను కూడా జత చేశాడు. తనను ధోనీ ఎత్తుకున్న, ధోనీతో కలిసి ట్రోఫీ అందుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

సోమవారం అర్ధరాత్రి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం గురించి జడ్డూ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘నా సొంత రాష్ట్రంలోని అభిమానుల మధ్య సీఎస్‌కే ఐదో టైటిల్‌ను గెలవడం అద్భుతంగా అనిపించింది. సీఎస్‌కేకు మద్దతుగా నిలవడానికి భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ అపూర్వ విజయాన్ని ఒకే ఒక వ్యక్తి కోసం అంకితం చేస్తున్నాం. మా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కోసమే గెలిచాం’’ అని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

More Telugu News