RJD: పార్లమెంటు భవనం డిజైన్ శవపేటికలా ఉందన్న ఆర్జేడీ.. తీవ్రంగా స్పందించిన బీజేపీ

  • శవపేటిక, పార్లమెంటు భవనం ఫొటోలను షేర్ చేసిన ఆర్జేడీ
  • ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమన్న ఆర్జేడీ నేతలు
  • అలా పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న బీజేపీ
  • వచ్చే ఎన్నికల్లో అదే శవపేటికలో జనం మిమ్మల్ని పాతిపెడతారన్న బీజేపీ నేత గౌరవ్ భాటియా
RJD equates new Parliament buildings design with coffin

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీహార్‌లోని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు నూతన భవనం డిజైన్‌ను శవపేటికతో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఓ వైపు పార్లమెంటు భవనం, మరోవైపు శవపేటిక ఫొటోలను షేర్ చేస్తూ ‘ఏంటిది?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని అన్నారు. దేశం దీనిని అంగీకరించడం లేదని పేర్కొన్నారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, చర్చలకు అది స్థానమని వివరించారు. 

ఈ ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు.

More Telugu News